AUTHOR

భండారు సదాశివరావు
జాతీయ, ధార్మిక, సాహిత్య రచనలు అందించిన శ్రీ భండారు సదాశివరావు గారు తెలుగు సాహిత్యంలో తనదైన ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. జాగృతి మరియు సాధన పత్రికలలో విశిష్ఠ వ్యాసాలతో బాటు శ్రీ కె. ఎం. మున్షీ రచించిన జై సోమనాథ్ నవలనూ తెనిగించారు. మన వారసత్వం, మహారాణా బాప్పా, జనవిజయం, యుగద్రష్ట డా. హెడ్గేవార్ మరియు శ్రీ గురూజీ మొదలుగా గల గ్రంధాలను రచించారు. భారతీయ రచయితల సమితి, మరియు అఖిలభారత సాహిత్య పరిషత్ కు అధ్యక్షులుగా వ్యవహరించారు. కొంత కాలం నేషనల్ బుక్ ట్రస్ట్ కు ట్రస్టీగా ఉన్నారు. శ్రీ శైలంలోని ఛత్రపతి శివాజీ స్ఫూర్తికేంద్రం నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన జట్టులో వారిది కీలకపాత్ర. శ్రీ గురూజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా వెలువరింపబడిన 12 భాగాల “శ్రీ గురూజీ సమగ్ర గ్రథావళి” కి సంపాదకీయం వహిస్తూ ఎక్కువ భాగాలను వారే తెలుగులో అనువాదం చేశారు. అగ్ని మూర్తులు, పృథ్వీ సూక్తం మొదలైన పద్య కవితా సంపుటాలను వెలువరించారు. ఇవన్నీ ఒక ఎత్తు కాగా శ్రీ కె.ఎం.మున్షీ రచించిన శ్రీ కృష్ణావతార గ్రంథాన్ని తెలుగులో తీసుకొని రావాలని వారు పడిన శ్రమ మరొక ఎత్తు. మోహన మురళి, రుక్మీణిహారణం, పంచ పాండవులు, భీముడు, సత్యభామ, వ్యాసుడు, యుథిష్ఠిరుడు - కురుక్షేత్రం అను ఏడు భాగాలుగా ఉన్న ఈ బృహద్గ్రంథాలన్ని తెలుగులోకి అనువదించారు. ఎనిమిదవ గ్రంథం శాశ్వతధర్మగోప్త వారు రచించిన ఈ కావ్యంలో వారి ఆత్మ కనబడుతుంది. ఏ గ్రంధం చేతిలోకి తీసికొన్న పుస్తకాన్ని మధ్యలో క్రిందపెట్టటం అసాధ్యమన్న రీతిలో పాఠకులను ఆకట్టుకోవటం శ్రీ సదాశివరావుగారి రచన శైలిలోని విశిష్ఠత.